Friday, February 1, 2013

నిజం నిప్పులాంటిది!



రాత్రి భోజనాలు చేసి పిల్లలు వచ్చేసరికి సావిత్రమ్మ బామ్మ ఏదో పుస్తకం చదువుకుంటున్నది. పదేళ్ళ రాంబాబు, ‘‘నిన్న మా బాబాయి ఆయన స్నేహితుడితో, ‘కృష్ణమూర్తి తన తెలివితేటలతో పదిమంది కళ్ళూ కప్పుదామనుకున్నాడు. అయినా నిజం నిప్పులాంటిది కదా? వాడికి తగిన శిక్షే పడింది,' అనడం విన్నాను. నిజం నిప్పులాంటిది అంటే ఏమిటి బామ్మా?'' అని అడిగాడు.
బామ్మ వాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, ‘‘కొందరు గోప్యంగా చెడుపనులు చేస్తూ ఉంటారు. అయితే అది ఎప్పుడో ఒకప్పుడు బయట పడే తీరుతుంది. దీన్నే మీ బాబాయి చెప్పాడు. వెనకటికి రామచంద్రం, జోగినాధం అనే వాళ్ళు ఇలాగే ప్రవర్తించారు. వాళ్ళ కథ చెబుతాను వినండి,'' అంటూ ప్రారంభించింది: గిరిపురం జమీందారు మాధవయ్య దివాణానికి ఒకసారి ఒక యువకుడు వచ్చి, ‘‘అయ్యూ నా పేరు విశ్వనాధం.
నా విద్య పరీక్షించి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే, మీ పేరు చెప్పుకుని బతుకుతాను,'' అన్నాడు. జమీందారు, ‘‘మా దివాణంలో రామచంద్రం, జోగినాధం అని ఇద్దరు పెద్దవాళ్ళు ఏనాటినుంచో పనిచేస్తున్నారు. నువ్వు నెల్లాళ్ళ పాటు వాళ్ళిద్దరి దగ్గరా పనిచెయ్యి. ఆ తర్వాత వాళ్ళు నిన్ను పనిలోకి తీసుకోమంటే, అప్పుడు చూద్దాం,'' అన్నాడు.
తెలివితేటలూ, మాటకారితనమూ కలిగిన విశ్వనాథం ప్రవర్తన, ఆ పెద్దవాళ్ళిద్దరికీ నచ్చింది. ఒక్కొక్క ఆడపిల్లే వున్న ఆ ఇద్దరికీ కూడా, విశ్వనాథాన్ని మంచి చేసుకుని, తమ పిల్లనిచ్చి పెళ్ళి చేద్దామన్న ఆలోచన వచ్చింది. జోగినాధం వీలుదొరికినపుడల్లా విశ్వనాధంతో,‘‘నువ్వా రామచంద్రాన్ని నమ్మకు.
అతడికి జమీందారుకు దొంగ లెక్కలు చెప్పి డబ్బు జేబులో వేసుకునే అలవాటుంది,'' అనేవాడు. ఇక రామచంద్రం విశ్వనాధంతో, ‘‘జోగినాధం చీటికీ మాటికీ ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో రోగం వచ్చిందని కల్లబొల్లి ఏడుపులు ఏడ్చి, జమీందారు దగ్గర డబ్బు గుంజుతూనే ఉంటాడు.

అలాంటి వాడితో జతకట్టావనుకో, నీకూ చెడ్డ పేరు రావడం ఖాయం!'' అంటూ పదే పదే చెబుతూండేవాడు. ఈ పెద్దలు ఒకరిపై ఒకరు చెప్పుకునే చాడీలు వినీవినీ విసిగిపోయిన విశ్వనాధం, వాళ్ళ మాటల్లో వున్న నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ఊరి కరణాన్ని కలుసుకుని పెద్దలు చెబుతూన్న మాటలు చెప్పాడు. అంతా విన్న కరణం, ‘‘ఇద్దరికి ఇద్దరూ మోసగాళ్ళే!
 
ఆ రామచంద్రం శ్రీరామనవమి ఉత్సవాలకోసం జమీందారిచ్చిన డబ్బులో చాలా భాగం, సొంతం చేసుకున్నాడు. ఇక జోగినాధం-జమీందారు ధర్మసత్రం ఖర్చులకు ఇచ్చే డబ్బులో సగానికి పైగా స్వాహా చేస్తున్నాడు. ఇదంతా, నాకూ, గ్రామ పెద్దలకూ తెలుసు. అయినా జమీందారుకు వాళ్ళంటే ఎక్కడలేని నమ్మకం. అందుకే ఆయనతో అసలు సంగతి చెప్పలేక పోతున్నాం,'' అన్నాడు.
 
విశ్వనాధం జమీందారును ఏకాంతంలో కలుసుకుని, ఇరవై రోజులుగా రామచంద్రం జోగినాధాల ప్రవర్తన, ఆ ఇద్దరి పట్లా గ్రామ కరణం, పెద్దల అభిప్రాయం ఏమిటో వివరించి, ‘‘తమరు అనుమతిస్తే, వారందరూ ఇప్పుడే వచ్చి దివాణం పెద్దలిద్దరి నిజ స్వరూపమేమిటో, విన్నవించుకోగలరు,'' అన్నాడు. జమీందారు, విశ్వనాధం మాటలకు ఒక్క క్షణం మాటరానట్టు ఉండిపోయి, ‘‘కరణం, ఊరి పెద్దలూ వచ్చి సాక్ష్యం పలకనవసరం లేదు. వాళ్ళ నిజాయితీని నేనెరుగుదును.
 
నిజం నిప్పులాంటిది కదా! ఎన్నాళ్ళని దాచగలరు? ఈ క్షణం నుంచీ రామచంద్రం, జోగినాథాలతో సహా ఉద్యోగులందరి మీదా అధికారిగా నిన్ను నియమిస్తున్నాను,'' అంటూ విశ్వనాథాన్ని మెచ్చుకున్నాడు. కథ ముగించిన బామ్మ, ‘‘మనం చేసే చెడ్డ పనులు ఎంత రహస్యంగా చేసినా ఎప్పుడో ఒకప్పుడు బయట పడక తప్పదు. కాబట్టి మంచి పనులను చేయడమే అలవాటు చేసుకోవాలి. నిజం నిప్పులాంటిది అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా?'' అన్నది. ‘‘తెలిసింది, బామ్మా,'' అంటూ పిల్లలందరూ ఉత్సాహంగా తలలు ఊపారు.

0 comments:

Post a Comment